ఎందరు సతులో యెందరు సుతులో - అచ్చంగా తెలుగు

ఎందరు సతులో యెందరు సుతులో

Share This

ఎందరు సతులో యెందరు సుతులో

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 



రేకు: 0354-01  సం: 04-315

పల్లవి: 

ఎందరు సతులో యెందరు సుతులో

యిందునందు నెట్లెరిగే నేను

చ.1:

మలయుచు నాయభిమానములని నే

కెలననిపుడు వెదకేనంటే

పలుయోనులలో పలమారుబొడమిన

చలమరి నాతొలుజన్మంబులను

చ.2: 

గరిమెలబాణిగ్రహణము నేసిన

సిరులచెలుల గలసేనంటే

తరుణుల గురుతులు తలపున మరచితి

పరగిన బహుకల్పంబులయందు

చ.3: 

శ్రీ వేంకటగిరి చెలువుని యాజ్ఞల

భావించి యేకరి బైకొంటి

తావులజూడగ తగిలికోర్కుల

భావరతుల బెంబడి మనసందు


భావం

పల్లవి:

ఇక్కడా అక్కడా(ఎన్నోజన్మలలో) నాకు  ఎందరు భార్యలో! ఎందరు బిడ్డలో!

నాకు ఎలా తెలుస్తుంది? ( తెలియుట కష్టమని భావం)

చ.1:

అనేక యోనులలో(జన్మస్థానములలో) అనేక సార్లు పుట్టిన మాత్సర్యశీల భరితమైన నా మొదటి జన్మలలో తిరుగుచూ ఆనాటి నా అభిమానములనుబంధుత్వాలను  ఇప్పుడు నేను వెతుక్కోగలనా? (సాధ్యం కాదని భావం)

చ.2:

అనేక కల్పములలో (1000 మహాయుగాలు అనగా 432, 000, 000 సంవత్సరాలు)గొప్పతనములతో నేను పెండ్లి చేసుకొన్న శోభలు వెదజల్లు నా భార్యలను కలుసుకోగలనావారిగుర్తులు మరిచిపోయాను.

చ.3:

 శ్రీ వేంకటగిరిదేవుడైన వేంకటేశుని ఆజ్ఞలతో ఆయనను  భావించిమన్మథాసక్తితో కోర్కెల జంతువులందు మనస్సును లగ్నం చేసి కిరాత భావాన్ని తలదాల్చాను.(ఇప్పటికయినా స్వామి ఆ కిరాత భావాన్ని పోగొట్టి మోక్షాన్ని అనుగ్రహించాలని భావం)

No comments:

Post a Comment

Pages