బాణాసురుడి వృత్తాంతము - అచ్చంగా తెలుగు

 బాణాసురుడి వృత్తాంతము

అంబడిపూడి శ్యామసుందర రావు 




ప్రహ్లాదుని మనవడు ,దైత్య రాజైన బలి చక్రవర్తి 100 మంది కుమారులు వారిలో బాణాసురుడు బాణాసురుని భార్య కండల అతను పెరిగి పెద్దయ్యాక పరమ శివుని కోసం తపస్సు చేశాడు శివుడు అతనికి వరాలు ఇచ్చి వరాలతో పాటు 1000 బాహులను ఇచ్చాడు బాణాసురుడు శివుని కైలాసానికి కాపలాదారుడిగా ఉండే వరం ఇమ్మని కోరుతాడు మొదట్లో ఈ కోరికకు ఆగ్రహించిన శివుడు ఆ వరాన్ని ప్రసాదించాడు.బాణాసురుడు అకుంఠిత దీక్షతో పరమ శివుని ధ్యానించి ఆయన్ని మెప్పించి తనకు రక్షణగా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఉండేది బాణాసురుని బలానికి భయపడి ఇతరులెవరు అతనిపై యుద్దానికి వచ్చేవారు కాదు. అహంకారము రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వు తప్ప నాతో యుద్ధం చేసే వారు లేరా అని అనగా శివుడు వీని రణకండూతికి, మూర్ఖత్వానికి చింతించి నీ రథం మీద ఉన్న జెండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్పాడు ఆగ్రహించిన శివుడు బాణాసురునితో నీతో యుద్ధం చేసే వారు ఇప్పటికే జన్మించాడు అని చెప్పి శివుడు వెళ్ళిపోతాడు.

బాణాసురుని కూతురు ఉష  చాలా అందగత్తె ఆవిడను వివాహమాడటానికి ఎందరో ముందుకు వచ్చిన బాణాసురుడు వారందరిని నిరాకరిస్తాడు ఉషకు  చిత్రలేఖ అనే చెలికత్తె ఉండేది. ఈమెకు చిత్రలేఖనంలో అసమాన  ప్రావీణ్యం ఉండేది. ఒకరోజు ఉషా దేవికి ఒక రాకుమారుడు కలలో కనిపించి ఆమెను ఆలింగనం చేసుకొంటాడు. ఆ విషయాన్ని చిత్రలేఖ కి చెప్పగా చిత్రలేఖ తన చిత్రకళా చాతుర్యంతో సమస్త భూగోళంలో ఉండే రాకుమారుల చిత్తరువులు గీసి చూపుతుంది. అందులో ఒక చిత్తరువు చూసి ఎవరే ఈ నవమోహన మోహనాంగుడు అని ఉషా దేవి అడుగగా చిత్ర లేఖ రాకుమారుడి చిత్తరువు చూసి ఈ రాకుమారుడా ఇతను శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు" అని చెప్పి చిత్రలేఖ తన మాయాశక్తితో  అనిరుద్ధుని బృందావనం నుండి శోణ పురానికి తెప్పించి ఉషా దేవి హంస తూలికా పాన్పు పై పడవేస్తుంది

ఆరోజునుండీ అనిరుద్దుడు ఉషాదేవి పూర్తి  ప్రణయ క్రీడలో మునిగి తేలుతుంటారు. ఫలితంగా ఉషాదేవి గర్భవతి అవుతుంది సేవకుల ద్వారా విషయం తెలుసుకున్న బాణాసురుడు అనిరుద్ధుని పైకి సైన్యాన్ని పంపగా అనిరుద్ధుడు వారిని ఓడిస్తాడు విషయం తెలుసుకున్న బాణాసురుడు అనిరుద్ధుడి పై దాడి చేసి నాగపాశము విసురుతాడు సమయములోనే బాణాసురుని రథం పై  జెండా విరిగి పడిపోయింది ఇది చూసిన బాణాసురుడు  తనని జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనంద పడుతాడు. బృందావనంలో అనిరుద్ధుడు కనిపించక పోయేసరికి అందరు చింతిస్తూ ఉంటే జగన్నాటక సూత్రదారి శ్రీకృష్ణుడు నారదుడి ద్వారా ఈ విషయాన్ని గ్రహిస్తాడు.

శ్రీకృష్ణుడు, తన సోదరుడు బలరాముడు ,సాత్యకి, నారాయణ సేనతో బాణాసురుని పైకి యుద్ధానికి వస్తాడు ఇద్దరి మధ్య సుదీర్ఘమైన యుద్ధము జరుగుతుంది  యాదవ సైన్యం బాణాసురుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది బాణాసురుడు తనకన్నా శ్రీకృష్ణుడు శక్తివంతుడని గ్రహించి పరమశివుడిని సహాయము కోసము పిలుస్తాడు. శివుడు మొదట తన గణాలను యుద్దానికి పంపుతాడు ఆ గణాలన్నీ యుద్దములో ఓడిపోవటం తో శివునికి స్వయంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.చివరికి యుద్ధము శ్రీ కృష్ణునికి శివునికి యుద్ధం జరగడం మొదలైంది.పరమశివుడు తన భక్తుడైన బాణాసురుడి కిచ్చిన మాట ప్రకారం భూత ప్రేత ప్రమధ గణాలతో యాదవుల మీదకు వచ్చి యుద్ధం చేస్తాడు. శివుడికి వాసు దేవునికి మధ్య యుద్ధం జరగడం తో సమస్త భూగోళం దద్దరిల్లుతుంది. ఈ యుద్ధాన్ని యక్ష, గంధర్వ, కిన్నెర కింపురుషులు గగనతలం నుంచి వీక్షించారు. శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వాసుదేవుడు బ్రహ్మాస్త్రం తోనే నిరోధించాడు.శివుడు వేసిన వాయవ్య ఆస్త్రాన్ని పర్వతాస్త్రంతో నిలిపాడు శ్రీకృష్ణుడు. శివుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు ఆ అస్త్రాన్ని నిరోధించాడు  శివుడు ప్రయోగించిన పాశుపతం శ్రీకృష్ణుడు ప్రయోగించిన నారాయణాస్త్రంతో చల్లారింది. శ్రీకృష్ణుడు శివుని అస్త్రాలన్నింటిని విచ్చిన్నం చేస్తున్నాడు 

పరిస్థితి గమనించి శివుడు ఈ యుద్ధం ఎప్పటికి అంతమవదని పైపెచ్చు వినాశనానికి దారి తీస్తుందని అర్ధం చేసుకున్నాడు చివరికి శివుడు  శ్రీకృష్ణునికి ఒక పరిష్కార మార్గాన్ని సూచించాడు అదేమిటి అంటే శ్రీకృష్ణుడు  శివుని పై సమ్మోహనాస్త్రం  ప్రయోగించటం.  ఆ అస్త్రాన్ని శివుడు ఎదుర్కొనలేడు  కాబట్టి మూర్చపోతాడు శివుడు చెప్పిన విధముగా శివునిపై సమ్మోహనాస్త్రాన్ని  ప్రయోగిస్తే శివుడు మూర్చపోతాడు శివుడు మూర్ఛ పోవడంతో బాణుడు కొయ్యబారి నిలబడిపోయాడు. అప్పుడు బాణుడి తల్లి కోతరా జుట్టు వీరపోసుకొని వివస్త్రై శ్రీకృష్ణుడి ముందు నిలబడుతుంది. అప్పుడు కోతరని చూడలేక శ్రీకృష్ణుడు రథంపై నుండి తల వెనుకకు త్రిప్పుకొంటాడు, వెంటనే బాణుడు పలాయన మంత్రం పఠిస్తాడు.బాణుడు ఒక్కడే అక్కడ యుద్ధ రంగంలో నిలబడి ఉండటంతో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం బాణుడి సహస్ర కరాలలో నాలుగింటిని మిగిల్చి మిగతా వాటిని ఖండిస్తుంది. అప్పుడు శివుడు సకల దేవతలు శ్రీకృష్ణుని వేడుకొనగా నారాయణుడు శాంతించి ప్రహ్లాద వంశస్థులను సంహరించను అని మాట ఇచ్చిన కారణమున బాణుడి ని విడిచి పెడుతున్నాను. బాణుడు శివ భక్తులలో అగ్రగణ్యుడిగా గా నిలుస్తాడు అని వరమిస్తాడు. తర్వాత బాణుడు ఉషా అనిరుద్ధులకు వివాహం జరిపిస్తాడు.ఇప్పటి అస్సాంలోని తేజ్ పూర్ ని బాణాసురుడు రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవాడు. ఇదివరకు దీనిని శోణాపుర్ లేదా శోనిట్ పూర్ అని కూడా పిలిచేవారు. 



No comments:

Post a Comment

Pages