దొరకినయప్పుడేతుదగాక
ఆచార్య తాడేపల్లి పతంజలి
రేకు: 0355-02 సం: 04-322
పల్లవి: దొరకినయప్పుడే తుదగాక
మరుగకుమెన్నడు మరి మనసా
చ.1: తనుభోగంబుల దనిపినపిమ్మట
వెనుకొని హరిదడవేనంటే
దినమును దను నింద్రియములచల మిది
తనియుట యెన్నడు దగు మనసా
చ.2: తిరమగునాసల దీరినపిమ్మట
తెరలి విరతి బొందే నంటే
మరలని యాశామయ మీచిత్తము
విరతి యెన్నడిక వెడ మనసా
చ.3: ముదిసినపిమ్మట మొగి శ్రీవేంకట -
సదయు గొలుతు నిచ్చలునంటే
హృదయము శ్రీవేంకటేశునినెల విది
యిదిగనుటెన్నడు యీమహి మనసా
భావం
పల్లవి:
ఓ మనసా !దొరకినయప్పుడే గట్టెక్కాలి.( ఎంతోఅదృష్టమయిన మానవ జన్మ దొరికింది.ఇప్పుడే స్వామి అనుగ్రహంతో మోక్షమనే గట్టెక్కాలని భావం)
లౌకిక భోగాలను ఎన్నడు మరుగకుము.
చ.1:
శరీర భోగములతో తృప్తి పొందిన పిమ్మట ఆ తర్వాత శ్రీ హరి భక్తిని గూర్చి ఆలోచిస్తానంటే అది సాగదు. ఎందుకంటే ప్రతిరోజు శరీరముతో ఇంద్రియముల పంతము కొనసాగుతుంది.( శరీరము ఇంద్రియవశమని భావం)
ఓమనసా! ఇక తృప్తి కి ఆస్కారమేముంది? ( తృప్తి పడలేమని భావం)
చ.2:
స్థిరమగు ఆశలు తీరినపిమ్మట తరువాత విశ్రాంతి పొందుతానంటే అది సాగదు.
ఎందుకంటే ఏనాటికి మరలని ఆశలతో ( తీరని ఆశలతో ) కూడినది ఈ చిత్తము.
అల్పమైన మనసా !ఇక ఆ ఆశలనుంచి విశ్రాంతి ఎప్పుడు? (ఆశలనిగ్రహం అవసరమని ప్రబోధం)
చ.3:
ముసలివాడయిన పిమ్మట మరలా శ్రీవేంకటేశ్వరుని నిత్యము కొలుస్తానంటే కుదరదు.
ఈ హృద యము శ్రీవేంకటేశుని స్థానము.
ఓ మనసా !ఈ భూమిలో హృద యాన్ని కనుగొనుటెన్నడు ?( హృదయంలో ఉన్న శ్రీ వేంకటేశుని కనుగొనుటకు ముసలితనం వచ్చేటంతవరకు ఆగకూడదని , నిరంతరం ధ్యానిస్తుండాలని ప్రబోధం)
***
No comments:
Post a Comment